సగటు విద్యాసంస్కారాలు గల తెలుగు ప్రేక్షకులను (అనగా మెజారిటీ ప్రజలను) మెప్పించడానికి, శతదినోత్సవాలు చేయించుకొనడానికి అవసరమైన బాక్సాఫీసు హంగు హంగామాలన్నింటినీ ఏర్చికూర్చి, రామకృష్టా ప్రొడక్షన్స్ వారు తయారు చేసిన భారీ (దాదాపు 16 వేల అడుగులు) చిత్రం 'టాక్సీరాముడు' ఎవరికీ ఆశాభంగం కలిగించదనే చెప్పవచ్చును.
'అద్భుతం', 'అమోఘం' ఇత్యాది పదార్థాలు మారిపోతున్న ఈ కాలంలో పండితులు, పత్రికలు, ఈ చిత్రాలను అద్భుతం, అమోఘం అని వర్ణిస్తే ఆశ్చర్యం లేదు. ఎలా ఉన్నాయని నిగ్గదీసి అభిప్రాయం అడిగితే చెప్పడం కష్టం. అందుకే-అనిర్వచనీయంగా ఉన్నాయంటే సరిపోతుందేమో. ఇక ఈ చిత్రాల స్థాయిని గురించి ప్రశ్నిస్తే-నూటికి 90 తెలుగు డబ్బింగు చిత్రాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ఇవీ అలాగే ఉన్నాయని చెప్పక తప్పదు.
'జేబుదొంగ', 'కన్యకాపరమేశ్వరీ మహాత్మ్యం' (డబ్బింగు) చిత్రాలు రెండూ కొంచెం హెచ్చు తగ్గుగా ఒకే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ కూడా ప్రేక్షక హృదయాలను కలచివేయగల విధంగా, ప్రేక్షకులలో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని రేకెత్తించగల విధంగా రూపొందించబడ్డాయి. ఏ కారణాల వల్లనైతే నేమి ఈ చిత్రాలను చూస్తున్నంత సేపూ అన్ని వర్గాల ప్రేక్షకులు నవ్వుకొంటూ, దుఃఖిస్తూ, పశ్చాత్తాప పడుతూ, నిట్టూరుస్తూ ఉంటారు.
బాలల చలనచిత్ర సంఘం వారు 'గురుభక్తి', 'ఏకత' చిత్రాలను నిర్మించారు. వీటిలో 'ఏకత' చిత్రం నిడివి 2,875 అడుగులు. ప్రదర్శనకాలం 30 నిమిషాలు ఉంటుంది. ఐకమత్యాన్ని గురించి ప్రబోధించే చిత్రం ఇది. భారతదేశంలో పూర్వం రాజులు తమలో తాము కక్షలు పెంచుకోవడం వల్ల విదేశీశత్రువులు మన దేశం మీదికి దండెత్తి సర్వనాశనం చేశారనీ, అందరూ ఐకమత్యంతో మెలగితే ఏశక్తీ మనను ఎదిరించలేదనీ ఒక పాఠశాలలో ఉపాధ్యాయిని పిల్లలకు చెబుతున్నట్లుగా దీనిని చిత్రీకరించారు. దేశద్రోహి అంభి వల్ల పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతుల్లో ఎలా ఓడిపోయాడో ఆమె ఉదాహరణగా చెబుతుంది.
ఇది స్టంటు చిత్రమని పేరు చూస్తేనే తెలిసిపోతుంది. అంత చక్కగా అతికేటట్లు పెట్టారు పేరు. ఈ చిత్రంలో ఇంకా స్టంటు చిత్రానికి కావలసిన సర్వలక్షణాలు ఉన్నాయి. స్టంటుకు అంతరాయం కల్పించని కథ, కథకు తగ్గ భాష అన్నీ చక్కగా అమరాయి. రీళ్ళ తరబడి కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేసి నటీనటులు అలసిపోగానే వారికి విశ్రాంతి కల్పించడంకోసం మధ్య మధ్య కథ వచ్చిపోతూ ఉంటుంది. ఈ కథలో మరొక విశేషం కూడా ఉంది. అది అవసరమైనప్పుడు జానపద చిత్ర వాతావరణంలోనికి, అక్కర్లేదనుకున్నప్పుడు సాంఘిక చిత్ర వాతావరణంలోనికి అంగలు వేస్తుంది. ఆయా సందర్భాలననుసరించి కత్తులు, గుర్రాలు, పిస్తోళ్ళు, జీప్ కార్లు కథలో ప్రవేశిస్తూ ఉంటాయి. నటులు కూడా కాసేపు జానపద వీరుల దుస్తులు, కాసేపు పాంట్లూ, జర్కిన్ లూ ధరిస్తారు.
సారథీ స్టూడియోస్ ఇంతకు ముందు నిర్మించిన చిత్రాల స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా-ఒకవిధంగా వాటికంటే ఒక మెట్టు ఉన్నత స్థాయిలో ఉన్నది 'కలసివుంటే కలదుసుఖం' చిత్రం. ఆ చిత్రాల మాదిరిగానే ఇది కూడా 'సాంఘిక ప్రయోజనం' పేరుతో నిర్మించబడింది. సారథీ స్టూడియోస్ ఇంతకు ముందు నిర్మించిన చిత్రాలన్నీ నినాద ప్రధాన చిత్రాలు. ఈ చిత్రంలో నినాదం పేరులో తప్ప వేరే ఎక్కడా వినిపించదు. ఇది వినోద ప్రధాన చిత్రం. ఆర్థిక విజయానికి కావలసిన బాక్సాఫీసు హంగులన్నింటినీ ఏర్చి కూర్చారు ఈ చిత్రంలో. అందుకే కథ 17,800 అడుగులు పొడుగుసాగింది.
విఠల్ ప్రొడక్షన్స్ వారి జానపద చిత్రం 'వరలక్ష్మీ వ్రతం', విఠల ఆచార్య గారు ఇంతకు ముందు నిర్మించిన 'కనకదుర్గపూజా మహిమ' చిత్రం-రెండూ కవల పిల్లలలాగా ఉంటాయి. రెండింటిలోనూ ఒకే హీరో (అడవిలో పెరిగిన రాకుమారుడు), ఒకే హీరోయిన్ (రాకుమారి), ఒకే విలన్ (మాంత్రికుడు), ఒకే హాస్యగాడు ఉన్నారు. ఈ పాత్రలను ధరించిన వారు కూడా ఆ చిత్రంలోనూ, ఈ చిత్రంలోనూ ఒకరే.
బసంత్-నాడియావారు లోగడ, సమర్పించిన 'రామభక్త హనుమాన్', 'వీరఘటోత్కచ', 'హనుమాన్ పాతాళవిజయం', 'జింబో', 'జింబో నగర ప్రవేశం' డబ్బింగ్ చిత్రాలను మెచ్చుకొని ఆదరించి వాటి ఆర్థిక విజయానికి ఇతోధికంగా తోడ్పడిన తెలుగు ప్రేక్షకులకు వాడియా వారి తాజాచిత్రం 'ఆరబ్బీవీరుడు జబక్' ఆశాభంగం కలిగించదనే చెప్పాలి. ఈ చిత్రం కూడా ఇంచుమించు పై చిత్రాల స్థాయిలోనే ఉన్నది. ఇది పూర్తి పంచరంగుల చిత్రం. మూడు గంటల ముచ్చటైన చిత్రం; నవరసభరితం. మిరుమిట్లు గొలిపే వర్ణ ఛాయాగ్రహణం, వినిపించని వీనులకు కూడా విందుచేసే శబ్దగ్రహణం ఇందులో చెప్పుకోతగ్గ అంశాలు. కావలసినన్ని కత్తి యుద్ధాలు, అంతకు మించిన నృత్యాలు, పాటలు, ఎడతెరిపిలేని సంభాషణలు ఈ చిత్రంలో క్రిక్కిరిసి ఉన్నాయి. మాటలను, పాటలను మింగి వేయాలని కుట్ర చేస్తున్న ధోరణి నేపధ్య సంగీతంలో కనుపిస్తుంది. మొత్తం మీద అన్ని అంశాలు ఎక్కువ మోతాదులో, ఒకదానితో ఒకటి పోటీ పడేవిగా ఉండటం చేత ఈ చిత్రం అధిక సంఖ్యాకులను ఆకర్షించవచ్చును. ఆర్థిక విజయం తప్పక పోవచ్చును.
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works